byసూర్య | Sat, Apr 04, 2020, 02:13 PM
కరోనా కరుడుకట్టిన ఉగ్రవాదిలా విరుచుకుపడుతుంది. ప్రపంచంలో ఈ పేరు విననివాడంటూ లేడంటే అది అతిశయోక్తి కాదు. ఈ మహమ్మారిని తరిమికొట్టడానికి ప్రపంచమే లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. దీని బారిన పడి కోల్కొంటున్న వారు కూడా తక్కువ సంఖ్యలోనే ఉన్నారు. కానీ యువకులు దీని బారి నుంచి కొంచెం త్వరగానే బయటపడుతున్నారు. ఇలా మన వరంగల్ జిల్లాకు చెందిన యువకుడు కూడా దాని బారిన పడి 14 రోజుల్లో కోల్కొని బయటపడ్డాడు. అయితే ఐసోలేషన్ అసలు ఎలా ఉంటుంది. అక్కడ చికిత్స అందిన విధానం, సౌకర్యాలు, రోగుల పట్ల తీసుకున్న జాగ్రత్తలపై తన అనుభవాలను యెన్నెంశెట్టి అఖిల్ (24) మనతో పంచుకున్నాడు. ఆయన మాటల్లోనే... నా పేరు అఖిల్ లండన్లోని ఎడెన్బర్గ్ వర్సిటీలో మానవహక్కుల చట్టాలపై పీజీ చేస్తున్నాను. ‘ఇంగ్లాండ్లో కరోనా వైరస్ ప్రబలినప్పటికీ గుంపులుగా ఉంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందన్న భావనతో లాక్డౌన్ విధించకుండా పబ్బులు, స్టేడియాలు, విశ్వవిద్యాలయాలు అన్ని యథేచ్ఛగా కొనసాగించారు. వైరస్ ఇంకా విజృంభించడంతో భారతీయ విద్యార్థులమంతా మాతృదేశానికి తిరిగి రావాలని చర్చించుకున్నాం. అదే సమయంలో మార్చి 18 నుంచి యూరప్, ఇంగ్లాండ్ దేశాల నుంచి విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్టు మనదేశం ప్రకటించింది. ఎంతోప్రయత్నించగా మార్చి 17న నాకు ఒక టికెట్ బుక్కయింది. ఎవరినీ ముట్టుకోకుండా ప్రయాణం చేసి.. ఇండియా రాగానే కరోనా పరీక్షలు చేయించుకోవాలనుకున్నా. అమ్మనాన్నను, స్నేహితులను ఎయిర్పోర్టుకు రావద్దని సూచించా. 19న ఎయిర్పోర్టులో దిగగానే హెల్త్డెస్క్ను సంప్రదించి పరీక్షలు చేయించుకున్నా. ఆరోగ్యంగా ఉండటంతో నెగిటివ్ వస్తుందని భావించా. కానీ పాజిటివ్ వచ్చింది. వ్యక్తిగతంగా హోటల్లో గది తీసుకొని క్వారంటైన్ ఉందామనుకున్నప్పటికీ.. వైద్యుల సలహామేరకు గాంధీలో చికిత్స పొందేందుకు చేరాను. గాంధీలోని ఐసొలేషన్ వార్డులో 14 రోజులపాటు చికిత్స పొందాను.‘కరోనా రోగులకు ఏర్పాటుచేసిన ఐసోలేషన్ వార్డులను మంచి ప్రమాణాలతో నిర్వహిస్తున్నారు. పేషెంట్లకు ఫోన్, వైఫై సౌకర్యం కల్పించారు. వార్డుల్లోని బెడ్స్, బెడ్షీట్స్ ఎప్పటికప్పుడు మార్చుతున్నారు. పేషెంట్ల దగ్గరికి ఎవరినీ అనుమతించడం లేదు. ప్రతిరోజూ ఉదయం డ్రైఫ్రూట్స్ ఇవ్వడంతోపాటు, ప్యాకేజీ ఆహారాన్ని వేడివేడిగా అందించారు. తాగునీరు ప్యాకింగ్ బాటిల్స్ ఇచ్చారు. గంటకోసారి మందులు, వైద్యసేవలు అందించారు. వైద్యులు పూర్థిస్థాయి రక్షణతో వైద్యం అందించారు. గుర్తుపట్టలేనంతగా డాక్టర్లు, సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైఫై సౌకర్యం కల్పించడంతో కుటుంబసభ్యులు, స్నేహితులతో ఫోన్లో నిత్యం మాట్లాడుకునే అవకాశం కలిగింది. వైఫై ఉండటంతో విశ్వవిద్యాలయం నుంచి ఆన్లైన్ తరగతులను ఫాలో అయ్యాను. క్లింటన్ ఫౌండేషన్ ప్రాజెక్టు కూడా పూర్తిచేశాను.ఎం కరోనా వైరస్ సోకిందని ఆందోళనతో కుంగిపోవద్దు, అవసరమైన వైద్యపరీక్షలు చేయించుకొని డాక్టర్ల సలహా మేరకు జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ నుంచి బయటపడవచ్చు. అధైర్యపడకుండా, మానసికంగా దృఢంగా ఉండాలని పేర్కొన్నాడు. కాబట్టి మీరు ఎటువంటి ఆందోళన చెండకుండా కరోనా వస్తేనే చనిపోతామని కంగారుపడకుండా ధైర్యంగా డాక్టర్లను సంప్రదింది ప్రభుత్వం అందిస్తున్న వైద్యాన్ని అందిపుచ్చకోండి.