byసూర్య | Sat, Apr 04, 2020, 11:22 AM
తెలంగాణ సర్కార్ ప్రజలకు శుభవార్త చెప్పింది. ఈ నెల మొత్తం రేషన్ సరఫరా చేస్తామని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ముందుగా 15 రోజుల పాటు రేషన్ సరఫరా చేస్తామని ప్రకటించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ నెల మొత్తం రేషన్ పంపిణీ చేస్తామన్నారు. వరుసగా మూడు నెలలు రేషన్ తీసుకున్న వారు వేలిముద్ర వేయకుండానే రేషన్ తీసుకునే సదుపాయం కల్పిస్తున్నామన్నారు. పోర్టబులిటీ ద్వారా రేషన్ తీసుకునే వారికి మాత్రం వేలిముద్ర తీసుకుంటున్నామని తెలిపారు. రేషన్ బియ్యం తీసుకుంటేనే రూ. 1500 నగదు ఇస్తారనే ప్రచారాన్న నమ్మొద్దని ఆయన పేర్కొన్నారు. రేషన్ బియ్యం తీసుకున్నా,తీసుకోకపోయినా 2,3 రోజుల్లో 87.59 లక్షల కుటుంబాలకు ఆన్ లైన్ ద్వారా రూ. 1500 నగదు వారి ఖాతాల్లో జమ అవుతుందని ఆయన పేర్కొన్నారు. కరోనా ప్రభావంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. దీంతో తెలంగాణ సర్కార్ తెల్ల రేషన్ కార్డు ఉన్న అందరికి మనిషికి ఉచితంగా 12 కిలోల బియ్యం,రూ.1500 నగదును అందజేస్తుంది. నగదును కార్డుదారుని ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది.