byసూర్య | Sat, Apr 04, 2020, 10:44 AM
కరోనా ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ తండ్రి తన కూతురు చనిపోతే ఆమె అంత్యక్రియలకు కూడా హాజరు కాలేకపోయాడు. హృదయ విదారకమైన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండలం తుంగూరుకి చెందిన పాలాజీ భాస్కర్,సునీత దంపతులు. వీరికి 11 ఏళ్ల కూతురు సాహిత్య ఉంది. సాహిత్య గత కొంత కాలంగా మధుమేహసమస్యతో బాధపడుతుంది. దీంతో అప్పులు చేసి మరి సాహిత్యకు తల్లిదండ్రులు చికిత్స చేయించారు. ఇక్కడ ఉపాధి లేకపోవడం, అప్పులు తీరే మార్గం కనిపించకపోవడంతో భాస్కర్ 5 నెలల క్రితం దుబాయ్ కి వెళ్లాడు. శుక్రవారం సాహిత్య పరిస్థితి విషమించి చనిపోయింది. కూతురు చనిపోయిన విషయం తెలిసిన భాస్కర్ తల్లడిల్లిపోయాడు. ప్రస్తుతం కరోనా ప్రభావంతో విమానాలు కూడా నడవడం లేదు. దీంతో భాస్కర్ ఇంటికి రాలేని పరిస్థితి. దీంతో సాహిత్య అంత్యక్రియలను వీడియో కాల్ ద్వారా భాస్కర్ కు చూపిస్తూ పూర్తి చేశారు. సాహిత్య అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో స్థానిక నాయకులు చందాలు వేసి పూర్తి చేశారు. ఈ ఘటన స్థానికంగా అందరిని కలిచి వేసింది.