byసూర్య | Sat, Apr 04, 2020, 10:29 AM
కరోనా వైరస్ ఆ తర్వాత లాక్ డౌన్.. సామాన్యులకు ఎన్నో కష్టాలు తెచ్చిపెట్టాయి.. మరో వైపు మందుబాబుల కష్టాలు వర్ణనాతీతం... లాక్ డౌన్ సమయంలో నిత్యావసరాలు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తుసుకుంటోంది.. నిత్యావసరాలకు సంబంధించిన షాపులతో పాటు.. చికెన్, మటన్ కి ఇబ్బంది లేదు. కానీ, అసలు కష్టం చుక్క దగ్గరే వచ్చింది. మద్యం షాపులతో పాటు కళ్లు దుకాణాలు కూడా మూతపడడంతో.. మత్తుకు అలవాటుపడిన వాళ్ళు అల్లాడి పోతున్నారు. పనిలేని రోజుల్లో ఇంటిదగ్గర ఉంటే.. చుక్క, ముక్క అలవాటు పడిన వాళ్లకు.. ముక్క వున్నా.. ఇప్పుడు కక్కలేక పోవడంతో వారి భాద చెప్పుకోలేని పరిస్థితి. దీంతో తెలంగాణాలో సరికొత్త రోగం తెరపైకి వచ్చింది. మందు తాగేవాళ్ళు, కల్లుతాగే వారికి అది దొరక్క వింతగా ప్రవర్తిస్తున్నారు. కల్లు కోసం ఆగమాగమైపోతున్నారు. కరోనాతో చావడం ఏమో కానీ.. మందు, కల్లు లేకపోతే సచ్చే పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు.
ఇక, మొదట ఒక్కరోజే జనతా కార్ఫ్యూ ప్రకటించడంతో... రేపటి నుంచి అన్ని దొరుకుతాయిలే అనుకున్నారు... కానీ.. అదికాస్తా ఈ నెల 31 వ తేదీ... ఆ తర్వాత ఏప్రిల్ 15 వ తేదీ వరకు పొడిగించడంతో... ఇది ఊహించని మందు బాంబులు ఇప్పుడు ఐరానా పడిపోతున్నారు. ఏప్రిల్ 15వ తేదీ వరకు ఇంట్లోనే ఉండాల్సిని పరిస్థితి. మరో వైపు ఇప్పటికే నోట్లోకి మత్తు వెళ్లక వారం రోజులకు పైగా దాటడంతో మత్తు బానిసలకు కాళ్లు చేతులు ఆడటంలేదంటే అతిశయోక్తి కాదు. కల్లు కోసం కల్లు దుకాణాల వద్దకు పెద్దసంఖ్యలో గుమిగుడుతున్నారు. కల్లుకు బానిసై తమ మగవారు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారని మహిళలు వాపోతున్నారు. కూలీనాలీ పనులు చేసుకునే తమ కోసం నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు గంటల చొప్పున కల్లు దుకాణాలను తెరవాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మందు, కల్లు కష్టాలు సామాన్యులకు మాత్రమే కాదు.. బడా బాబులకు కూడా తాకాయట. కొంత వరకు తమదగ్గర ఉన్నమందుతో కొంత వరకు నడిపించినా.. ఇప్పుడు మాత్రం కష్టంగా మారింది అంటున్నారు. ఇవాళ అసలే ఆదివారం.. ముక్క వరకు సరే.. చుక్కలేకపాయే అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.