దేశంలో 2,500కి చేరిన కోవిడ్ కేసులు

byసూర్య | Fri, Apr 03, 2020, 08:17 AM

దేశంలో కరోనా వైరస్ కేసులు పెరగడానికి నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలు ప్రధాన కారణమయ్యాయి. దక్షిణ కొరియాలో కరోనా బాధిత మహిళ సృష్టించిన కల్లోలం మాదిరిగానే ప్రస్తుతం దేశాన్ని నిజాముద్దీన్ మర్కజ్ భయకంపితులను చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో మార్చి 1 నుంచి 15 వరకు నిర్వహించిన మతపరమైన కార్యక్రమాల్లో విదేశీయులు సహా పలు రాష్ట్రాల నుంచి వేలాది మంది పాల్గొన్నారు. తబ్లిగీ జమాత్‌ ప్రార్థనాల్లో పాల్గొని కరీంనగర్‌ వచ్చిన ఇండొనేసియా బృందంలోని కొందరికి కరోనా వైరస్‌ నిర్ధారణ కావడంతో తెలంగాణ సర్కారు కేంద్రాన్ని అప్రమత్తం చేసింది.


 


మత ప్రార్థనల్లో పాల్గొన్న ఆరుగురు తెలంగాణవాసుల మృతి చెందారు. ఏపీలో కరోనా కేసులకూ ఢిల్లీలోనే మూలాలున్నట్టు నిర్ధారణ కావడంతో వివిధ రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. 24 గంటల వ్యవధిలో దేశంలో 547 కేసులు నమోదు కావడం, లాక్‌డౌన్‌ స్ఫూర్తికి జమాత్‌ సదస్సు ఎన్ని తూట్లు పొడిచిందో చాటుతోంది.


 


కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా విధించిన లాక్‌డౌన్ కొనసాగుతుండగా, దేశంలో కేసులు సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 2,500దాటగా.. గడచిన 24 గంటల్లోనే 540కిపైగా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మొత్తం 77 మంది మృతిచెందారు. అత్యధికంగా మహారాష్ట్రలో 21 ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో అత్యధికంగా 423 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ మర్కజ్ ప్రభావం తమిళనాడులో స్పష్టంగా కనబడుతోంది. ఆ రాష్ట్రంలో మూడు రోజుల్లోనే 240 వరకు కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ కేసులకు ఢిల్లీ నిజాముద్దీన్‌తోనే సంబంధం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.


 


తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గురువారం ఒక్కరోజే ఏపీలో 38, తెలంగాణలో 27 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 154, ఏపీలో 149కి చేరుకుంది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 17 మంది కరోనా బాధితులు కోలుకోగా.. 9 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.


 


ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ ఉద్ధృతంగా ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 38 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 149కి చేరింది. రాష్ట్రంలో కరోనా తొలి మరణం గురువారం నమోదైంది. సోమవారం రాత్రి 10 వరకు 43 కేసులే నమోదుకాగా, ఆ తర్వాత మూడు రోజుల్లో అదనంగా 106 కేసులు నమోదయ్యాయి. బుధవారం రాత్రి 10 నుంచి గురువారం ఉదయం వరకు 21, గురువారం సాయంత్రం మరో 11 కేసులు నిర్ధారణ అయ్యాయి. సాయంత్రం 6 గంటల తర్వాత మరో 6 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 24 కేసులు, తర్వాత 23 కేసులతో కృష్ణా, 20 కేసులతో గుంటూరు ఉన్నాయి.


 


గురువారం ఒక్కరోజే తెలంగాణలో 27 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కోవిడ్-19 బాధితుల సంఖ్య 154కు పెరిగింది. ప్రస్తుతం 128 మంది వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. తాజాగా మరో ముగ్గురు కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో మొత్తంగా కరోనా నుంచి కోలుకున్న వారు 17 మంది అయ్యారు.


 


ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 77 మృతిచెందారు. అత్యధికంగా మహారాష్ట్రలో 21 మంది, తెలంగాణ 9, మధ్యప్రదేశ్ 8, గుజరాత్ 7 పశ్చిమ్ బెంగాల్ 6, పంజాబ్ 5, ఢిల్లీ 4, కర్ణాటక 3, జమ్మూ అండ్ కశ్మీర్, ఉత్తర ప్రదేశ్, కేరళలో 2, ఏపీ, బీహార్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్‌లో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 191 మంది బాధితులు కోలుకున్నారు.


 


మహారాష్ట్రలో 423, తమిళనాడులో 309, ఢిల్లీలో 293, కేరళలో 286, తెలంగాణ 154, ఆంధ్రప్రదేశ్ 149, రాజస్థాన్ 133, ఉత్తరప్రదేశ్‌లో 126, కర్ణాటకలో 124, మధ్యప్రదేశ్ 107, గుజరాత్ 88, జమ్మూ కశ్మీర్ 70, పశ్చిమ్ బెంగాల్ 53, హర్యానా 49, పంజాబ్ 47, బీహార్ 29, చండీగఢ్ 18, అసోం 16, లడఖ్ 13, అండమాన్ నికోబార్ దీవులు 10, ఉత్తరాఖండ్ 10, చత్తీస్‌గఢ్ 9, హిమాచల్‌ప్రదేశ్ 6, గోవా 5, ఒడిశా 5, పుదుచ్చేరి 5 కేసులు నమోదయ్యాయి.


Latest News
 

చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన నీలం మధు ముదిరాజ్ Fri, Mar 29, 2024, 03:42 PM
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య? Fri, Mar 29, 2024, 03:11 PM
సీఎం రేవంత్ ను కలిసిన కేకే Fri, Mar 29, 2024, 03:08 PM
నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM