byసూర్య | Thu, Apr 02, 2020, 09:43 AM
బయటికి రాకండి.. కరోనా సోకే ప్రమాదం ఉందని చెబుతున్నా హైదరాబాద్ ప్రజలు వినిపించుకోవడం లేదు. లాక్ డౌన్ విధిస్తున్నా పట్టించుకోవడం లేదు. పోలీసుల కళ్లు గప్పి రోడ్లపై దర్జాగా తిరుగుతున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో పోలీసులు ప్రజల్ని హెచ్చరిస్తున్నా.. ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ సిటీలో రోజూ వేలల్లో లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. ముఖ్యంగా పోలీసుల నిఘా తక్కువగా ఉన్న ప్రాంతాల్లోని రోడ్లపై వెహికల్స్తో యథేచ్ఛగా తిరుగుతున్నారు. నిత్యావసరాల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇష్టమొచ్చినట్లు బయటకు వస్తున్నారు. చెక్ పోస్ట్ల వద్ద డ్యూటీలో ఉన్న పోలీసులకు మస్కా కొట్టి తప్పించుకుంటున్నారు. లాక్ డౌన్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రోజుకు సగటున 28 వేల వాహనాలు రోడ్డెక్కాయి. గత వారం రోజుల్లో 2.8 లక్షల వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు ఎంవీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఇవే కాకుండా పోలీస్ చెకింగ్స్, సీసీ కెమెరాలకు చిక్కకుండా సిటీ రోడ్లపై యువత వెహికల్స్తో తిరుగుతూనే ఉన్నారు. దాదాపు 20 శాతం మంది ఏం పని లేకుండానే రోడ్లపై తిరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.