byసూర్య | Wed, Apr 01, 2020, 02:17 PM
లాక్ డౌన్ సమయంలో పేదలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ఆదుకుంటుందని నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. మంగళవారం సాయంత్రం సికింద్రాబాద్ స్టేషన్ వద్ద ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాలకు చెందిన 250 మందికి షెల్టర్ కల్పించి భోజనాలు పెడుతున్నామని అన్నారు. అలాగే నగరంలో 155 కేంద్రాల వద్ద అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ఉచితంగా భోజనం అందిస్తున్నామని చెప్పారు. వీరికి రాత్రిపూట వంట చేసుకునేందుకు ఈ సరుకులను అందిస్తున్నామని చెప్పారు. నగరంలోని 6 జోన్ పరిధిలో 1300 మంది యాచకులను గుర్తించి బస, భోజనాలు అందిస్తున్నామని వివరించారు. ఇంకా ఇలాంటి వారు ఎక్కడ ఉన్నా సర్వే చేసి ఆకలి బాధ తీరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి, ఆర్డీవో వసంత కుమారి, ఉప కమిషనర్ ముఖుందారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయితే తెచ్చిన సరుకులు అందరికి సరిపోలేదు. ప్రతి పేదవాడి ఆకలి తీరుస్తామని చెప్పి సరుకులు కొంత మందికి పంపిణీ చేసి మేయర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అధికారులు తెచ్చిన సరుకులు కొందరికి పంచగానే అయిపోయాయి. దీంతో సరుకులు దొరకని వారు చేసేదేమీ లేక వెళ్లిపోయారు. తమను రెండు గంటలు నిలబెట్టి ఉసురూ మంటూ వట్టి చేతులతో పంపిస్తున్నారంటూ వారు వాపోయారు.