byసూర్య | Wed, Apr 01, 2020, 09:58 AM
కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా గడచిన పదిరోజులుగా లాక్ డౌన్ అమలవుతోంది. అయితే ప్రస్తుతం మరో పెద్ద చిక్కు వచ్చిపడింది. ఏంటంటే. రేపు ఒకటో తారీఖు కావడంతో ఒక్కసారిగా విత్డ్రాయల్స్కు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. దీంతో తగినంత స్థాయిలో నగదు నిల్వలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ రంగ బ్యాంకులకు సూచించారు. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం రేపు వివిధ వర్గాలకు చెందిన ప్రజల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయనుంది. దీంతో ఆయా వర్గాలు విత్డ్రా చేసుకునేందుకు వీలుగా బ్యాంకుల శాఖలను తెరిచి ఉంచాలని పేర్కొంది. దీంతో పాటు జీతాల విత్డ్రాయల్స్కు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి పదో తారీఖు దాకా బ్యాంకుల్లో రద్దీగా ఉంటుందని ఓ బ్యాంకు అధికారి వివరించారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే డిమాండ్కి తగినంత స్థాయిలో శాఖలతో పాటు ఏటీఎంలలో కూడా నగదు నిల్వలు ఉండేలా చూసుకోవాలని ఇప్పటికే బ్యాంకులకు ఆర్థిక శాఖలో భాగమైన ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) సూచించింది. అంతేకాదు సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో శాఖలను కూడా తెరిచి ఉంచాలని కూడా ఆదేశించింది. అంతేకాదు బ్యాంకుల సిబ్బంది, ఆర్బీఐ ఉద్యోగులు, నగదు సరఫరా చేసే సంస్థల సిబ్బంది, ఏటీఎం మెయింటెనెన్స్ ఉద్యోగులు, నగదు వ్యాన్లు మొదలైన వాటి రాకపోకలకు ఆటంకాలు కలగకుండా చూడాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కూడా డీఎఫ్ఎస్ లేఖ రాసింది. డిజిటల్ చెల్లింపులపై జాగ్రత్తలు తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)లకు కూడా డీఎఫ్ఎస్ సూచించింది.