byసూర్య | Wed, Apr 01, 2020, 09:18 AM
రామోజీరావు... తెలుగు మీడియా మొఘల్ గా పేరున్న వ్యాపారవేత్త. ఆయన ఏ వ్యాపారం చేతబట్టినా బంగారమే అయ్యింది. విజయవంతమైన వ్యాపార వేత్త అయినా.. ఎన్నో రంగాల్లో అడుగు పెట్టినా ఈనాడు రామోజీరావుగానే ఆయన ఫేమస్. అంతగా ఆయన పేరు ఈనాడుతో పెనవేసుకుపోయింది. తెలుగు వారికి, దేశానికి ఎప్పుడు కష్టం వచ్చినా ఆదుకునేవారిలో ముందుటారాయన. ఇప్పుడు కరోనా సమయంలోనా మరోసారి ఆయన తన పెద్ద మనసు చాటుకున్నారు.
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారిపై పోరాటానికి.. రామోజీరావు 20 కోట్ల రూపాయల భారీ విరాళం అందించారు. తెలుగు రాష్ట్రాలకు చెరో 10 కోట్ల రూపాయల చొప్పున విరాళం ఇచ్చారు. తెలుగు వారికి ఆర్ధికంగానూ కొంత చేదోడుగా నిలిచేందుకు ఈ డబ్బును ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి పంపించారు. ముఖ్యమంత్రులను నేరుగా కలిసి ఇవ్వడానికి లాక్ డౌన్ ఉన్న కారణంగా ఆన్ లైన్ లో సొమ్మును బదిలీ చేశారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధుల ఖాతాల్లో... చెరో 10 కోట్ల రూపాయల చొప్పున ఆన్లైన్ ద్వారా జమ చేశారు. కరోనాపై పోరులో ప్రజలు విజయం సాధించాలని రామోజీరావు ఆకాంక్షించారు. సీఎం సహాయనిధికి 10 కోట్ల విరాళాన్ని అందించడంపై ముఖ్యమంత్రి జగన్.. రామోజీరావుకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ మేరకు రామోజీరావుకు లేఖ రాసిన జగన్ ప్రభుత్వం చేపట్టే సహాయ, పునరావాస కార్యక్రమాలకు ఈ నిధులు ఉపయోగపడతాయన్నారు. సంక్షోభ సమయంలో మద్దతుగా నిలిచినందుకు లేఖలో కృతజ్ఞతలు తెలిపారు. జగన్ ఇలా రామోజీరావుకు లేఖ రాయడం ఇదే తొలిసారి.