byసూర్య | Mon, Mar 30, 2020, 05:00 PM
కరోనా వైరస్ దెబ్బకి దేశం మొత్తం లాక్ డౌన్లోకి వెళ్లిపోయింది. చాలా కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఎట్ హోం ఆప్షన్ అందించాయి. అయితే కొన్ని కంపెనీలు ఇంటి వద్ద నుంచే పని చేసే ఉద్యోగులుకు పలు ప్రత్యేక సదుపాయాలు కూడా కల్పిస్తున్నాయి. ఇప్పుడు దేశీ అతిపెద్ద కమోడిటీ ఎక్స్చేంజ్ ఎంసీఎక్స్ మాత్రం దీనికి భిన్నంగా వెళ్తోంది. ఎంసీఎక్స్ తన ఉద్యోగులకు అధిక వేతనం అందిస్తోంది. ఆఫీస్ నుంచే పనిచేస్తూ ఉంటే ఈ సదుపాయం లభిస్తుంది. కంపెనీ కొంత మందికి ఏకంగా 3 రెట్లు ఎక్కువ జీతాన్ని ఆఫర్ చేస్తోంది. ఎంసీఎక్స్లో దేశ వ్యాప్తంగా దాదాపు 400 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 300 మంది ముంబైలోనే విధులకు హాజరవుతున్నరు. ‘గత శుక్రవారం నుంచి 50 మంది కీలక ఉద్యోగులు ఆఫీస్కు వచ్చి పనిచేస్తున్నారు. వారికి పూర్తి సహకారం అందిస్తున్నాం. దైనందిన అవసరాలు దగ్గరి నుంచి చాలా సౌకర్యాలు కల్పిస్తున్నాం’ అని కంపెనీ తెలిపింది. మేనేజ్మెంట్ వారి పనికి గుర్తింపుగా వేతనాన్ని డబుల్ చేయాలని నిర్ణయించిందని పేర్కొంది. కొంత మందికి అయితే ఏకంగా మూడు రెట్లు వేతనం లభిస్తుందని తెలిపింది.