byసూర్య | Mon, Mar 30, 2020, 04:22 PM
ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. 10 ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని కలిపేసి 4 బ్యాంకులుగా మార్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 1న బ్యాంకులు విలీనం కానున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్-OBC, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-UBI, కెనెరా బ్యాంకులో సిండికేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంకులో అలహాబాద్ బ్యాంక్ విలీనం కానున్నాయి. బ్యాంకుల విలీనం కస్టమర్లకు లాభమా? ఖాతాదారులు నష్టపోతారా? విలీనం తర్వాత అకౌంట్లలో జరిగే మార్పులు ఏంటీ అన్న సందేహాలు చాలామందిలో ఉంటాయి. బ్యాంకుల విలీనం రాత్రికి రాత్రి జరిగేది కాదు. కొన్ని నెలల పాటు సాగే ప్రక్రియ. ఈ నాలుగు బ్యాంకుల విలీనం గురించి గతేడాది ఆగస్టులోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అయితే బ్యాంకుల విలీనం పేరు వినగానే సదరు బ్యాంక్ ఖాతాదారులు కంగారుపడాల్సిన అవసరం లేదు. విలీన ప్రక్రియలో కస్టమర్లకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటాయి బ్యాంకులు. అకౌంట్ల విషయంలో ఏవైనా మార్పులు ఉంటే కస్టమర్లకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తాయి. మీ దగ్గర ఉన్న ఏటీఎం కార్డులు, చెక్ బుక్స్ కొన్ని రోజులవరకు వాడుకోవచ్చు. ఏ బ్యాంకులో విలీనం అయితే ఆ బ్యాంకు పేరుతో పాస్ బుక్స్, ఏటీఎం కార్డులు వస్తాయి. కస్టమర్లు బ్యాంకుకు వెళ్లి మార్చుకోవచ్చు. ఇప్పుడు ఉన్న బ్రాంచ్లోనే బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు.