byసూర్య | Mon, Mar 30, 2020, 11:23 AM
కరోనా నివారణకు చేపట్టిన లాక్ డౌన్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో చిక్కుకుపోయిన ప్రతి ఒక్కరిని బీజేపీ కార్యకర్తలు ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ పిలుపునిచ్చారు. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన కార్మికులు లాక్ డౌన్ కారణంగా కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ వద్ద నివసిస్తున్న సంఘటన చూసి చలించిపోయిన బండి సంజయ్, వారికి 20 రోజులకు సరిపడా 11 రకాల నిత్యావసర సరుకులు అందించారు. కరోనా నివారణకు చేపట్టాల్సిన జాగ్రత్తలను వారికి వివరిస్తూ, ఎలాంటి సహాయం కావాలన్న చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. ప్రభుత్వ పరంగా కూడా వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించడానికి సహకరిస్తానని, లాక్ డౌన్ ముగిసే వరకు ఎవరికి ఏ సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధం అని తెలిపారు. దేశంలో కరోనా వైరస్ నివారణకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన లాక్ డౌన్ ను ప్రతి ఒక్కరు పాటించాలని, ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు సైనికుని వలే పోరాడాలని, దాని కోసం ఎవ్వరు ఇంటి నుండి బయటకు రాకూడదని అన్నారు.