byసూర్య | Sat, Mar 28, 2020, 03:44 PM
లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి తెలంగాణ,ఏపీ రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్ బుకింగ్స్ బాగా పెరిగాయి. మున్ముందు సిలిండర్లు దొరకవేమో అని చాలా మంది ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. అందరూ రెండేసి, మూడేసి బండలు బుక్ చేస్తుండటంతో కంపెనీలకు షాక్ తగిలినట్లైంది. ముఖ్యంగా హైదరాబాద్లోనైతే సాధారణంగా బుక్ చేసుకునే 2 లక్షల సిలిండర్లకు బదులు మూడున్నర లక్షల సిలిండర్లు బుక్ చేసుకున్నారు. ఇలాగే ఊరుకుంటే పరిస్థితి మరింత దారుణం అవుతుందని గ్రహించిన గ్యాస్ కంపెనీలు డబుల్ బుకింగ్స్ నిలిపేశాయి.
మామూలుగానైతే ఒక సిలిండర్ బుక్ చేసుకున్నాక రెండోది కావాలంటే 24 గంటల తర్వాత బుక్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఓ వ్యక్తికి గ్యాస్ బండ ఇస్తే నెక్ట్స్ 14 రోజుల వరకూ ఆ వ్యక్తి మరో సిలిండర్ బుక్ చేసుకునే ఛాన్స్ లేదు. భారత్, హెచ్ పీ గ్యాస్ కంపెనీలు ముందుగా ఈ రూల్ తెచ్చాయి. ఇప్పుడు ఇండేన్ గ్యాస్ కంపెనీ కూడా ఇదే రూట్ లోకి వచ్చేసింది. ఇలాంటి రూల్ లేకపోతే కొంతమందికే బండలన్నీ లభిస్తాయనీ, అందరికీ అవి చేరువయ్యేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. తెలంగాణలో గ్యాస్ కంపెనీలు అధికారికంగానే ఈ నిబంధనను అమలు చేస్తున్నాయి. ఏపీలో కూడా ఇదే నిబంధననను అమల్లోకి తేనున్నారని తెలుస్తోంది.