byసూర్య | Fri, Jan 17, 2020, 04:44 PM
నిర్భయ దోషులకు శిక్ష అమలుపై కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. కోర్టు ఆదేశాలను తూచ తప్పకుండా అమలు చేస్తామని.. డెత్వారెంట్ ప్రకారం శిక్ష అమలువుతుందని తెలిపారాయన. న్యాయవ్యవస్థలో ఉన్న లొసుగుల ఆధారంగా నేరస్థులు అనేక కారణాలతో శిక్షలు అమలుకాకుండా ఆలస్యం అయ్యేలా చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే పోక్సో చట్టంలో కేంద్రం పలుమార్పులు చేసినట్లు కిషన్రెడ్డి గుర్తు చేశారు. తద్వారా 18 ఏళ్ల లోపువారిపై నేరాలకు పాల్పడ్డ దోషులకు రెండు నెలల్లోపే శిక్ష పడేందుకు అవకాశం ఉంటుందన్నారు. వరంగల్లో చిన్నారిపై జరిగిన అత్యాచారం కేసులో 51 రోజుల్లో శిక్ష పడిందని.. నిర్భయ కేసులోనూ డెత్ వారెంట్ ప్రకారం ఉరి అమలు చేయాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. నిర్భయ తరహా ఘటనల్లో దోషులకు క్షమాపణ తగదని రాష్ట్రపతి గతంలోనే పేర్కొన్నారని గుర్తు చేశారు. హోంశాఖకు వచ్చిన క్షమాభిక్ష పిటిషన్పై మేం ఏమాత్రం జాప్యం చేయకుండా నిర్ణయం తీసుకున్నామని కిషన్ రెడ్డి వివరించారు.