byసూర్య | Fri, Jan 17, 2020, 03:52 PM
రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల అభివృద్ధికి గత ఆరేళ్లలో టీఆర్ఎస్ చేసిందేమీ లేదని, భవిష్యత్లో కూడా ఆ పార్టీ నేతలు ఏమీ చేయబోరని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్లు విషయాలు సీఎం కేసీఆర్కు గుర్తుకు రావాలంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ను చిత్తుగా ఓడించి కాంగ్రెస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. మూడేళ్లలో మిషన్భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్లు ఇవ్వకపోతే ఓట్లడగబోనని 2014లో అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చెప్పారని, నేటికీ నీళ్లివ్వని టీఆర్ఎస్ కు మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లడిగే అర్హత లేదన్నారు. అన్ని అంశాల్లో కేసీఆర్ మాట తప్పిన విషయాన్ని ప్రజలకు వివరించాలని, అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ రూపొందించిన కామన్ మేనిఫెస్టో–విజన్ డాక్యుమెంట్ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు.