byసూర్య | Fri, Jan 17, 2020, 12:44 PM
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. పారా మెడికల్ బోర్డును రద్దు చేసే దిశగా ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బోధనలో నాణ్యతా ప్రమాణాలతో పాటు ఉపాధి అవకాశాలు తగ్గడంతో సీఎం కేసీఆర్ పారా మెడికల్ బోర్డును రద్దు చేయనున్నట్లు సమాచారం. పారా మెడికల్ బోర్డును రద్దు చేసి కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో విలీనం చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ పారా మెడికల్ బోర్డు ఏర్పాటు జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 10 ప్రభుత్వ 210 ప్రయివేట్ పారా మెడికల్ కాలేజీలున్నాయి. ఒక్కో కాలేజీలో ఒక్కో కోర్సుకు 60 సీట్లు ఉన్నాయి. అన్ని కాలేజీల్లో దాదాపు 30 వేల సీట్లున్నాయి.
వీటిలో అధికంగా ప్రయివేట్ కాలేజీలోనే ఉన్నాయి. ఇవన్నీ పారా మెడికల్ బోర్డు ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. విద్యార్ధులకు కనీస అవగాహన లేకపోవడంతో జాయిన్ అయిన కొద్ది రోజులకే బయటకు వస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం కొన్ని కాలేజీలు నడుస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. ఉపాధి అవకాశాలు కూడ లేకపోవడంతో మెడికల్ బోర్డు రద్దుకే ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. కాళోజీ హెల్త్ వర్సిటీలో వీలినం తర్వాత పారా మెడికల్ డిప్లోమా కోర్సు స్థానంలో డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న రెండేళ్ల డిప్లొమా కోర్సును మూడేళ్లు చేయనున్నారు. ఇలా చేస్తే డిగ్రీ పట్టాతో ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.