byసూర్య | Thu, Jan 16, 2020, 05:35 PM
యాదాద్రి భువనగిరి జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు అడ్డుకున్నారు. యాదాద్రిలో పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం చేయడానికి బైక్ ర్యాలీ నిర్వహించాలనుకున్నారు. అయితే, బైక్ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు రాజాసింగ్ను అడ్డుకున్నారు. దీంతో ర్యాలీని విరమించుకున్న ఆయన పార్టీ కార్యాలయంలో బీజేపీ అభ్యర్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీకి ఓటు వేస్తేనే మున్సిపాలిటీల అభివృద్ధి సాధ్యమవుతుందని, టీఆర్ఎస్కు ఓటు వేస్తే అభివృద్ధి శూన్యమని అన్నారు. ఇష్టారీతిన డబ్బులు వృథా చేయడంతో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవని తెలిపారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పబ్బం గడుపుతున్నారని రాజాసింగ్ మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన కేసీఆర్కు తెలంగాణ సమాజాన్ని ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపెడతామని చెప్పారు. బీజేపీ అంటే సీఎం కేసీఆర్ భయపడుతున్నారని, అందుకే యాదాద్రిలో బీజేపీ బైక్ ర్యాలీకి అనుమతివ్వలేదన్నారు.