byసూర్య | Thu, Jan 16, 2020, 04:33 PM
దేశంలోనే మొట్టమొదటిసారిగా మున్సిపల్ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయకుండా ఫేస్ రికగ్నైజేషన్ యాప్ను ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 10 పోలింగ్ కేంద్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఉపయోగిస్తున్నట్లు ఎస్ఈసీ పేర్కొంది. ఈ 10 పోలింగ్ కేంద్రాల్లో ఒక ప్రత్యేక పోలింగ్ ఆఫీసర్ అదనంగా ఉండనున్నారు.
ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్తోపాటు వీడియో రికార్డింగ్ చేస్తామని, వెబ్ కాస్టింగ్ లేని పోలింగ్ కేంద్రాల వద్ద మైక్రో అబ్జర్వర్లు ఉంటారని ఎస్ఈసీ తెలిపింది. ఒక్కో వార్డు, డివిజన్లో పదిమంది కంటే ఎక్కువ అభ్యర్థులు లేరని, బ్యాలెట్ పత్రాల ముద్రణ రూపు సాయంత్రం వరకు పూర్తవుతుందని స్పష్టం చేసింది.
మున్సిపల్ ఎన్నికల కోసం 44వేల మంది ఎన్నికల సిబ్బంది, ఉద్యోగులు పోలీసులు విధుల్లో ఉంటారని, ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. తెలుపు రంగు బ్యాలెట్ పేపర్ను వాడుతున్నట్లు వెల్లడించారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో ఇద్దరు యూనిఫామ్ పోలీసులు ఉంటారని వివరించారు. పరకాల మున్సిపాలిటీల్లో వార్డుల ఏకగ్రీవాలపై కలెక్టర్, ఎన్నికల పరిశీలకులను ఎస్ఈసీ వివరణ కోరింది. జనవరి 14 తర్వాత ఏకగ్రీవమైన వార్డులు, డివిజన్లను పరిగణనలోకి తీసుకోమని స్పష్టం చేసింది.