byసూర్య | Thu, Jan 16, 2020, 01:49 PM
మున్సిపల్ ఎన్నికల రాజకీయం మేడ్చల్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. తాజాగా మంత్రి మల్లారెడ్డి ఆడియో టేపులు లీక్ కావడంతో వివాదం రాజుకుంది. బోడుప్పల్కు చెందిన టీఆర్ఎస్ నేత రాపోలు రాములుతో మంత్రి మల్లారెడ్డి మాట్లాడిన ఫోన్ ఆడియో సోషల్ మీడియాలో లీక్ కావడంతో ఈ ఫోన్ కాల్ వ్యవహారం టీఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. టికెట్ల కోసం డబ్బులు అడిగిన సాక్ష్యాలు తన దగ్గర ఉన్నాయని మంత్రి మల్లారెడ్డితో రాపోలు రాములు మాట్లాడిన ఆడియో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు తనకు టికెట్ ఇచ్చేందుకు మంత్రి మల్లారెడ్డి రూ. 50 లక్షలు డిమాండ్ చేశారని బోడుప్పల్ టీఆర్ఎస్ నేత రాపోలు రాములు ఆరోపిస్తున్నారు. టికెట్ల కేటాయింపులో మల్లారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఆయన టికెట్లు అమ్ముకుంటున్నారని, తన వర్గానికి టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని ఆయన విమర్శిస్తున్నారు.