కోడిపందేల్లో తెలంగాణ మంత్రి తలసాని సందడి..

byసూర్య | Thu, Jan 16, 2020, 11:56 AM

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సందడి చేశారు. స్థానికులతో కలిసి కోడి పందేలలో పాల్గొన్నారు. బంధువులు, స్నేహితులతో కలిసి ఉల్లాసంగా గడిపారు. అంతకుముంద ఉండి కోట్ల ఫంక్షన్ హాల్‌లో బంగారు తులాభారం నిర్వహించారు. తొలుత పటిక బెల్లం, ఆ తర్వాత పది రూపాయల నాణేలతో తులాభారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంతెన రామరాజు, వైఎస్సార్‌సీపీ నేతలు హాజరయ్యారు.


తులాభారం వేసిన నాణేలను మావుళ్లమ్మ, వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో సమర్పిస్తారు. మావుళ్లమ్మను దర్శించుకున్న అనంతరం కోడి పందేలకు వెళ్లారు తలసాని. సంక్రాంతి సమయంలో ఏలూరుకు రావడం తలసానికి ఏటా ఆనవాయితీ. ఏలూరుకు వచ్చిన తలసానికి స్థానికులు ఘన స్వాగతం పలికారు.


 


ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన తలసాని.. రాజధాని అంశం సహా తాజా రాజకీయ పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీకి 2019 సార్వత్రిక ఎన్నికల నాటి ఫలితాలే వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం తప్పిదం వల్లే ఏపీలో రాజధాని సమస్య ఉత్పన్నమైందన్నారు. రాజధాని విషయంలో శాశ్వత పరిష్కారం ఉండాలని సూచించారు.


ప్రభుత్వంతో ఉంటే సమస్య పరిష్కారం అవుతుందని అమరావతి రైతులకు తలసాని సూచించారు. ‘ప్రభుత్వాన్ని నమ్మండి, ప్రభుత్వంతో ఉండండి.. మీకు సమస్య పరిష్కారం అవుతుంది. వైఎస్ జగన్ ఆషామాషీ ముఖ్యమంత్రి కాదు. అందరి ఆకలి తెలిసినవాడు.. నిర్దాక్షిణ్యంగా దేన్నీ తీసేసే పరిస్థితి ఉండదు. రైతులతో చర్చలు జరుగుతాయి, తప్పకుండా మేలే జరుగుతుంది’ అని తలసాని వ్యాఖ్యానించారు.


జోలె పట్టుకొని భిక్షమెత్తుతున్న నేతలను నమ్మితే కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్లే ఉంటుందని తలసాని ఎద్దేవా చేశారు. ‘రైతులు సంతోషంగా ఉండాలనే నేను మొదటి నుంచి చెబుతున్నా. రాజధాని విషయంలో మాత్రం కొంత ఆందోళన ఉంది. ప్రభుత్వంతో చర్చిస్తే తప్పకుండా మంచి ముగింపు వస్తుందని భావిస్తున్నా. అయితే.. ఈ అంశం పూర్తిగా ఇక్కడ ప్రభుత్వం, ప్రజలకు సంబంధించింది.. నేను ఇంతకంటే ఎక్కువగా మాట్లాడలేను’ అని తలసాని అన్నారు.


 


సంక్రాంతి సంతోషంగా జరుపుకునే పండుగ అని చెప్పిన తలసాని.. గోదావరి జిల్లాల్లో వేడుకలు మరింత ప్రత్యేకమని అన్నారు. ‘ఇక్కడ సంక్రాంతి వేడుకలు బ్రహ్మాండంగా ఉన్నాయి. గోదావరి జిల్లాల్లో ఎప్పుడూ ప్రత్యేకమే. భోగి, సంక్రాంతి వేడుకలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలు తిలకించడానికి అందరూ ఆసక్తి కనబరుస్తారు. దూర ప్రాంతాలకు వెళ్లి సెటిలైన వారు కూడా సంక్రాంతి పండక్కి ఇంటికి వస్తారు. ఇదొక మంచి సంప్రదాయం’ అని తలసాని అన్నారు.


సంక్రాంతి సమయంలో గోదారి జిల్లాల్లో మగవాళ్లందరూ కోడి పందేలు తదితరాలతో కాలక్షేపం చేస్తారని చెప్పిన తలసాని.. వాటిని తప్పుబట్టడానికి వీల్లేదన్నారు. ఇది సాంప్రదాయంగా కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. ఇక గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సందర్భంగా పిండి వంటలు మరింత ప్రత్యేకమని తలసాని కితాబిచ్చారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM