byసూర్య | Sun, Jan 12, 2020, 07:50 PM
గ్యాంగ్ స్టర్ నయీం మేనకోడలు షాహీదా రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. నల్గొండ జిల్లా కేశరాజుపల్లి శివారులో షాహీదా ప్రయాణిస్తున్న కారు అతి వేగంగా లారీని ఢీకొట్టింది. దీంతో షాహీదా అక్కడికక్కడే మృతి చెందింది. నల్గొండ నుంచి మిర్యాలగూడ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు షాహీదా మృతదేహాన్ని నల్గొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నయీమ్ కేసుల్లో నిందితుడు ఫహీం భార్యే షాహీదా.
మావోయిస్టుగా జీవితాన్ని ప్రారంభించి.. తర్వాత కోవర్టుగా మారి.. పోలీసుల చేత పెంచి పోషించబడినట్లు ఆరోపణలు ఎదుర్కొని వారి చేతులోనే గ్యాంగ్ స్టర్ నయీముద్దీన్ అలీయాస్ నయీం హతమయ్యాడు. తెలుగు రాష్ట్రాల్లో అనేక భూ సెటిల్ మెంట్లు, కబ్జాలు, హత్యలు చేస్తూ వేల కోట్ల రూపాయలు సంపాదించిన గ్యాంగ్ స్టర్ నయీంను పోలీసులు 2016, ఆగస్టు 8న ఎన్ కౌంటర్ చేసి చంపేశారు.
షాద్ నగర్ లోని మిలీనియం టౌన్ షిప్ లోని ఓ ఇంట్లో నయీం తలదాచుకున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు పెద్దఎత్తున్న అక్కడికి చేరుకున్నారు. నయీం అనుచరులు కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నయీం అక్కడికక్కడే మృతి చెందాడు. నయీంపై వందల సంఖ్యలో కేసులు ఉన్నాయి. నక్సలైట్ నుంచి గ్యాంగ్ స్టర్ గా మారిన నయీం.. దందాలు, ల్యాండ్ సెటిల్మెంట్ల, బెదిరింపుల ద్వారా వందల కోట్లు కొల్లగొట్టినట్లు దర్యాప్తులో తేలింది.