byసూర్య | Sat, Jan 11, 2020, 05:56 PM
హైదరాబాద్ – హైదరాబాద్ – విజయవాడ, విజయవాడ – హైదరబాద్ లో ప్రయాణం ఇప్పుడు నరకంగా మారింది…సంక్రాంతి సందర్భంగా ఇరు రాష్ట్రాలలలో వారం రోజుల పాటు సెలవులు రావడంతో స్వస్థలాలలో సంక్రాంతి వేడుకలు జరుపుకునేందుకు వేలాది కుటుంబాలు పయనమయ్యారు… నిన్నటి నుంచి హైదరాబాద్ ఖాళీ కావడం ప్రారంభమైంది.. బస్సులు ఫుల్, రైళ్లు అంతకుంటే ఫుల్.. ఇక తప్పని పరిస్ధితుల్లో స్వంత వాహనాల్లో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపుకు బయలు దేరి వెళుతున్నారు.. ఈ ప్రయాణాలకు టోల్ గేట్స్ స్పీడ్ బ్రేకర్లుగా మారాయి.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. తెలంగాణ, హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వారికి నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్గేట్లో 8 టోల్ బూతులు తెరిచారు. బూత్లో ఫాస్ట్ ట్యాగ్ స్కానర్ పనిచేయకపోవడంతో పాత రేట్ల ప్రకారం డబ్బులు తీసుకొని వాహనాలను పంపుతున్నారు.
ఫాస్ట్ టాగ్పై అవగాహన లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. టోల్గేట్ వద్ద ప్రత్యేకంగా ఫాస్ట్ టాగ్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. దీంతో వాహనదారులంతా ఫాస్ట్ టాగ్లను తీసుకుంటున్నారు. ఇక కీసర , మాడ్గుపల్లి, కొర్లపహాడ్ టోల్ ప్లాజాల వద్ద కూడా వాహనాల రద్దీగా బాగా ఉంది. గంటగంటకు హైవేలపై వాహానాల రద్దీ పెరిగుతోంది. టోల్ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి. హైదరాబాద్, విజయవాడ 65 నెంబర్ జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్ధీ పెరిగింది. కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరడంతో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు. కొన్ని టోల్ ప్లాజాల వద్ద వాహానదారులు అసహనానికి గురవుతున్నారు. ఫాస్ట్ ట్యాగ్ తగిలించుకున్నా గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క టోల్ప్లాజా వద్దే దాదాపు రెండు మూడు గంటలు వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. పండుగ వేళ టోల్ ఫీజు రద్దు చేయాలని ఇరు ప్రభుత్వాలను ప్రజలు కోరుతున్నారు.. గత ఏడాది సంక్రాంతి సమయంలో టోల్ ఫీజ్ ను తెలంగాణ ప్రభుత్వ రద్దు చేసింది. ఈ ఏడాది కూడా రద్దు చేసి తాము త్వరగా స్వస్థలాలకు వెళ్లేలా చూడాలని అంటున్నారు ప్రయాణీకులు