byసూర్య | Tue, Oct 15, 2019, 10:52 AM
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంతో పాటు సమస్యలు, డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. కార్మికుల సమ్మె ఇవాళ్టికి 11వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా కార్మికులు రోజుకో విధంగా నిరసనలు తెలుపుతున్నారు. ఇవాళ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు, మానవహారాలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ సమస్య పరిష్కారానికి టీఆర్ఎస్ నేత కేకే రాయబారం పంపారు. కార్మికులు సమ్మె విరమించి చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. కేకే మధ్యవర్తిత్వం వహిస్తే చర్చలకు సిద్ధమని ఆర్టీసీ జేఏసీ పేర్కొంది. ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తే హాజరవుతామని ప్రకటించింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమే యూనియన్లు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. కాగా విలీనం మినహా మిగతా అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది.