byసూర్య | Tue, Oct 15, 2019, 01:48 AM
సచివాలయాన్ని ఎందుకు కూల్చివేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సోమవారం ఈ మేరకు ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖాళీ చేసి అప్పగించిన ఐదు బ్లాకుల భవనాలు కూడా ఉన్నాయి కదా? అవి సరిపోవా? అంటూ హైకోర్టు ప్రశ్నించింది. ప్రస్తుతం ఉన్న భవనాలకు అగ్ని ప్రమాదాలు పొంచివున్నాయని అగ్నిమాపక శాఖ నివేదిక ఇచ్చిందంటూ ప్రభుత్వం తరపున అదనపు ఏజీ వాదనలు వినిపించారు. అగ్ని ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని మాత్రమే ఫైర్ డిపార్ట్మెంట్ సూచనలు చేసిందని, భవనాలు కూల్చమని చెప్పలేదు కదా? అని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సమాధానంగా అన్ని శాఖలు ఒకే చోట ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ఆలోచన అని అదనపు ఏజీ హైకోర్టుకు వివరించారు.
కొత్త సచివాలయం నిర్మించాలంటూ సాంకేతిక కమిటీ కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని ఏజీ హైకోర్టు న్యాయమూర్తుల దృష్టికి తీసుకువచ్చారు. మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న తర్వాతే సాంకేతిక కమిటీ నివేదిక ఇచ్చిందని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసిందన్న విషయం తమ దృష్టి దాటిపోలేదని వ్యాఖ్యానించింది.
పిటిషనర్ విశ్వేశ్వరరావు తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ హైకోర్టులో తమ వాదనలు వినిపిస్తూ, ఇప్పటికే అప్పుల కారణంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని తెలిపారు. పరిపాలన అంశాల్లో ఎలా జోక్యం చేసుకుంటారని పిటిషనర్ను హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సమాధానంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నప్పుడు కోర్టులు జోక్యం చేసుకోవచ్చని పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పారు. అయితే, సచివాలయ నిర్మాణం ప్రజల కోసం కాదా? అని హైకోర్టు ప్రశ్నించింది.