byసూర్య | Mon, Oct 14, 2019, 07:41 PM
హుజూర్ నగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 17న హుజూర్ నగర్ లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్ లు పరిశీలించారు. హుజూర్ నగర్ నియోజకవర్గ ఉప ఎన్నిక సందర్భంగా జరుగుతున్న భారీ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు వారు ముమ్మర కసరత్తులు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారసభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్న నేపథ్యంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం సభ విజయవంతమయ్యేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని మంత్రి అన్నారు. కార్యక్రమంలో మంత్రులతో పాటు ఉప ఎన్నిక ఇంచార్జ్, శాసనమండలి సభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, శాసనసభ్యులు గాధారి కిశోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.