byసూర్య | Mon, Oct 14, 2019, 06:22 PM
ఎన్నారై విధానం ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయం ఎంతో గొప్పదని, సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని ఎన్నారైలందరూ స్వాగతిస్తున్నారని టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల అన్నారు. దేశంలోనే సమగ్ర విధానమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గల్ఫ్ ఎన్నారైలను తెలంగాణకు రప్పించడానికి సీఎం కేసీఆర్ త్వరలో గల్ఫ్ దేశాలు పర్యటించనున్న సందర్భంగా మహేశ్ అమెరికాలో మీడియాతో మాట్లాడారు. ఎన్నారై విధానం కోసం ప్రత్యేక బృందాన్ని కేరళకు పంపిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నారై విధానంపై చర్చ మొదలుకాకముందే దుబాయ్ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రకటించిన సమయంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 600 మందిని తెలంగాణకు రప్పించామని చెప్పారు.
హుజూర్నగర్ ఉపఎన్నికల్లో ఎన్నారై సైదిరెడ్డికి రెండోసారి టికెట్ ఇవ్వడం ఎన్నారైలందరూ గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపారు. ఎన్నారైలు తమవంతు పాత్ర పోషించి సైదిరెడ్డిని గెలిపించాలని, బంధుమిత్రులకు సోషల్ మీడియాలో చేరువగా ఉండాలని సూచించారు. వీలైన ఎన్నారైలు హుజూర్నగర్కు వచ్చి ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు తిరిగిరాగానే సీఎం కేసీఆర్ను కలిసి గల్ఫ్ బాధితుల సమస్యలపై వినపతిపత్రం ఇస్తామని తెలిపారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ యూఎస్ఏ కన్వీనర్ శ్రీనివాస్ గనగోని, నాయకులు దేవేందర్ నల్లమాడ, శ్రీనివాస్ ఎం, వెంకట్ గజ్జల పాల్గొన్నారు.