byసూర్య | Mon, Oct 14, 2019, 02:18 PM
ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు బాధించాయి అని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు పేర్కొన్నారు. ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం చూపదు అని ఆయన స్పష్టం చేశారు. పరిస్థితులు చేయిదాటక ముందే ఆర్టీసీ యూనియన్ నేతలు కార్మికులను సమ్మె విరమింపజేసి చర్చలకు సిద్ధం కావాలని టీఆర్ఎస్ పార్టీ తరపున కే కేశవరావు సూచించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తప్ప కార్మికులు లేవనెత్తిన మిగతా డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలి. ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం గతంలో గొప్పగా పరిష్కరించింది. 44 శాతం ఫిట్మెంట్, 16 శాతం ఐఆర్ ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే. ఆర్టీసీని ప్రయివేటీకరించే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ చెప్పారు. అద్దె బస్సులు, ప్రయివేటు స్టేజీ క్యారేజీల విషయంలో సీఎం కేసీఆర్ ప్రకటనను ప్రస్తుత సమ్మె నేపథ్యంలో తీసుకున్న నిర్ణయంగా మాత్రమే చూడాలి. ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపే ప్రతిపాదనేది ఎన్నికల ప్రణాళికలో చేర్చలేదు. ఆర్టీసీయే కాదు ఏ ప్రభుత్వ రంగ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని మేనిఫెస్టోలో పేర్కొనలేదు అని కేశవరావు స్పష్టం చేశారు.