byసూర్య | Mon, Oct 14, 2019, 01:34 PM
ఓ సామాన్యుడు సీఎం కార్యాలయం హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి తన బాధను చెప్పుకున్నాడు. ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసమే. ఆర్టీసీ బస్సులు కూడా మా కోసమే. కానీ ఇప్పుడీ పరిస్థితి ఏంటి? మధ్యలో మేం నలిగిపోతున్నాం. పిల్లల స్కూళ్లకు సెలవులు పొడిగించడం ఎందుకు. ఇప్పటికే 16 రోజులు సెలవులిచ్చారు. చదివిందంతా పిల్లలు మరచిపోతున్నారు. ఆర్టీసీ వాళ్లు సమ్మె చేస్తే, స్కూలు బస్సులను వాడుకోవడం ఏంటి?" .
తన పేరు రంజిత్ కుమార్ అని, తనది కరీంనగర్ అని వెల్లడించిన ఆయన, ముఖ్యమంత్రి రాష్ట్రానికి తండిరి వంటి వాడని, పిల్లలు అల్లరి చేస్తుంటే, పిలిచి, మాట్లాడి, బుద్ధి చెప్పాలిగానీ, 'నువ్వు పోతేపో... నేను పీకేస్తా' అని కయ్యాలు పెట్టుకోవడం ఏంటని ప్రశ్నించాడు. ఇది పద్ధతి కాదని చెప్పాడు. ఉద్యమాలతోనే తెలంగాణను తెచ్చుకున్నామని, అటువంటి ఉద్యమాలను అణచి వేయడం ఏంటని ప్రశ్నించాడు. తెలంగాణ ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలని అన్నాడు. 'నేను విన, నేను జేయ' అంటే రాష్ట్రంలో నడవదని హెచ్చరించాడు. తన మాటలను సార్ దృష్టికి తీసుకెళ్లాలని హెల్ప్ లైన్ లో రంజిత్ చేసిన వ్యాఖ్యలను టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి. కాగా, సిద్ధిపేటకు చెందిన కరుణాకర్ అనే యువకుడు సైతం ఇదే హెల్ప్ లైన్ కు కాల్ చేసి సమ్మెపై ఆవేదన వ్యక్తం చేశాడు.