byసూర్య | Mon, Oct 14, 2019, 12:57 PM
ఆర్టీసి కార్మికులకు మద్దతుగా బస్ భవన్ ముట్టడికి విద్యార్ధి సంఘాలు యత్నించాయి. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్,పది వామపక్ష విద్యార్ధి సంఘాలు ఆర్టీసి కార్మికులకు మద్దతుగా బస్ భవన్ ముట్టడికి బయల్దేరాయి. మరికొంత మంది ముషిరాబాద్ డిపో వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీసులు విద్యార్దులను అడ్డుకొని అరెస్ట్ చేశారు. విద్యార్దులను విచక్షణా రహితంగా రోడ్ల మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వాహనాలలో పడేశారు. దీంతో అక్కడ విద్యార్ధి సంఘాలకు, పోలీసులకు తోపులాట జరిగింది. పోలీసులు లాఠీచార్జీకి కూడా సిద్దమైనట్టు సమాచారం. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కాస్త వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. మరో వైపు ప్రభుత్వం నిరంకుశత్వాన్ని విద్యార్ధి సంఘాల నేతలు ఖండించారు. అరెస్ట్ చేసిన నాయకులను వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. కేసీఆర్ తీరు పై విద్యార్ధి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తన తీరును మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నేత జావీద్ హెచ్చరించారు.