byసూర్య | Mon, Oct 14, 2019, 07:04 AM
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ రెండవమారు మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన అనంతరం హెచ్ఎండిఎ అధికారులతో జరిగిన మొదటి సమావేశంలోనే నగర శివారులో చర్లపల్లి, ఈ దుల నాగులపల్లిలో వస్తున్న రెండు రైల్వే టెర్మినల్స్కు చేరువగా బహుళ ప్రయాణ ప్రాంగణాలను నిర్మించే దిశగా ప్రణాళికలను సిద్ధ్దం చేయాలని ఆదేశించారు. దీంతో అథారిటీ అధికారులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.హైదరాబాద్ లో మరో రెండు ప్రపంచస్థాయి బహుళ ప్రయాణ ప్రాంగణాలు ఏర్పాటుచేసేందుకు హెచ్ఎండిఎ ప్రణాళికలను సిద్దం చేస్తున్నట్లు సమాచారం. హెచ్ఎండిఎ చట్టం2008 కల్పిస్తున్న ల్యాండ్ పూలింగ్ స్కీం(ఎల్పిఎస్)ను వీలైనంత త్వరగా కార్యరూపంలోకి తీసుకురావాలని నిర్ణయించారు. రైల్వే టెర్మినల్స్ వస్తున్న చర్లపల్లి, ఈదుల నాగులపల్లి ప్రాంతాలను పరిశీలించి భూ సమీకరణ పథకం ద్వారా భూమిని సేకరించాలనే యోచిస్తున్నారు. అం దుకు ఆ ప్రదేశాల్లోని భూములు మాస్టర్ప్లాన్2031 ప్రకారంగా భూ వినియోగ కేటగిరీలను పరిశీలిస్తున్నారు. అక్కడి భౌగోలిక పరిస్థితులు, అందుబాటులో ఉన్న రోడ్డు మార్గాలు, రైతుల వ్యవహార శైలిలను ప్లానింగ్ అధికారులు అంచనా వేస్తున్నట్టు కార్యాలయ వర్గాలు పేర్కొంటున్నాయి.హైదరాబాద్ మహానగరం ఔటర్ రింగ్ రోడ్ లోపల శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పెరుతున్న జనాభకు అనుగుణంగా భవిష్యత్ రవాణా అవసరాలను అంచనావేస్తూ చర్లపల్లి, ఈదులనాగులపల్లిలో కనీసంగా 100 ఎకరాల విస్తీర్ణం, రూ. 100 కోట్లు అంచనా వ్యయంతో ప్రపంచస్థాయి ప్రయాణ ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని అథారిటీ భావిస్తున్నది. రైల్వే స్టేషన్ల వద్ద నే ఇంటర్ సిటీ బస్టెర్మినల్స్ నిర్మించే విధంగా అందుకు కావాల్సిన భూములను ల్యాండ్ పూలింగ్ స్కీం(ఎల్పిఎస్) ద్వారా సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది.అందుకు కావాల్సిన ప్లానింగ్ నిపుణులను 20 మందిని కాంట్రాక్ట్ పద్దతిని తీసుకునేందుకు త్వరలోనే ప్రకటన వెలువరించాలని నిర్ణయించింది. డిల్లీలోని ఆనంద్నగర్, కర్ణాటకలోని బెంగళూరు, కేరళలోని అలువే రైల్వే స్టేషన్లకు ఆనుకునే బస్సుటెర్మినల్స్ ఉన్నాయి. అయితే, చర్లపల్లి, ఈదులనాగులపల్లిలో సరుకుల రవాణా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలను రూపొందించాలని అథారిటీ భావిస్తున్నది.ప్రస్తుతం హెచ్ఎండిఎ చేపట్టిన పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్(పిపిపి) పద్దతిలోనే ఈ రెండు టెర్మినల్స్ను నిర్మించాలనే యోచిస్తున్నది. ఈపాటికే నగర శివారులో బాటసింగారం, మంగళ్పల్లిలో రెండు భారీ ట్రక్కు టెర్మినల్స్ను పిపిపి విధానంలోనే నిర్మించింది. ఇటీవలనే మంగళ్పల్లిలో 20 ఎకరాల్లో నిర్మించిన ట్రక్కుపార్కు వినియోగంలోకి వచ్చింది. బాటసింగారంలోనిది జనవరిలో ప్రారంభించనున్నట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ పద్దతిలో చేపట్టడం వల్ల ఇటు ప్రభుత్వానికిగానీ, అటు హెచ్ఎండిఎకు గానీ ఆర్థికంగా నిధుల అవసరముండదు.ల్యాండ్ పూలింగ్ స్కీం ద్వారా సమీకరించుకున్న భూమిని మాత్రమే నిర్మాణదారులకు అప్పగించి 33 ఏళ్ళ కాలపరిమితితో చేసుకున్న షరతు ప్రకారంగా నిర్మించడం, నిర్వహించడం, బదిలీ చేయడం జరుగుతుంది. దీంతో అత్యాధునిక వసతులతో కూడిన బహుళ ప్రయాణ ప్రాంగణం ఎలాంటి నిధులు వెచ్చించకుండానే పథకాన్ని పూర్తిచేయడం జరుగుతుందని హెచ్ఎండిఎ అధికారులు వివరిస్తున్నారు. మంత్రి కెటిఆర్ ఆదేశాల మేరకు త్వరలోనే ట్రాన్జాక్షన్ అడ్వైజర్ను కూడా నియామకం చేసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.