byసూర్య | Sat, Oct 12, 2019, 12:20 PM
తెలంగాణలో 8 వరోజు ఆర్టీసి సమ్మె కొనసాగుతోంది. అయితే ఇప్పటికే ఆర్టీసి కార్మికులకు వివిధ ఉద్యోగ సంఘాలు వారు, రాజకీయ పార్టీలు, ఓయూ జేఏసీ, విద్యార్ధి,యువజన సంఘాలు మద్దతు ప్రకటించాయి. బీజేపీ నాయకులు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆర్టీసి సమ్మె పై జోక్యం చేసుకోవాలని కోరారు. బీజేపీ నాయకులు గవర్నర్ ను కలవడం వెనుక రాజకీయ వ్యూహం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ఆర్టీసిలో కేంద్రం వాటా కూడా ఉంటుంది. అయితే ఈ వాటా నామమాత్రమే. కానీ గవర్నర్ సమ్మె, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల పై కేంద్రానికి నివేదిక అందజేస్తే కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం లేకపోలేదు. గవర్నర్ కాకముందు రాజకీయాల్లో కీలకంగా పని చేసిన తమిళిసై ప్రస్తుత పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్టు తెలుస్తోంది.
బీజేపీ నేతల ఫిర్యాదు తర్వాత గవర్నర్ ఆర్టీసి సమ్మె పై ప్రత్యేక ఫోకస్ పెట్టారని ఆమె ఏ క్షణంలోనైనా కేంద్రానికి నివేదిక అందజేసే అవకాశం ఉందని తెలుస్తోంది. తనకున్న విచక్షణాధికారం ద్వారా గవర్నర్ ఆర్టీసి సమ్మె పై జోక్యం చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రజలు రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ మార్గాలు కలిపించడంలో విఫలమైందని బీజేపీ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటన్నింటి నేపథ్యంలో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ త్వరలోనే స్పందించనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. మరో వైపు గవర్నర్ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో నిశ్శబ్దంగానే ఉంటారని చర్చ జరుగుతోంది.