byసూర్య | Sat, Aug 24, 2019, 06:21 PM
హైదరాబాద్ రన్నర్స్, ఎయిర్టెల్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్–2019’ కార్యక్రమం నిర్వహించనున్నారు. మారథాన్ సందర్భంగా సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరంలోని పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్డు నుంచి హైటెక్ సిటీ మీదుగా గచ్చిబౌలి వరకు మొత్తం 42 కిలోమీటర్లు జరుగనున్న ఈ మారథాన్లో హాఫ్ మారథాన్, ఫుల్ మారథాన్లు ఉదయం 5 గంటల నుండి 12 గంటల వరకు జరుగనుంది. 10కే రన్ హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుండి గచ్చిబౌలి వరకు సాగనుంది. ఈ మారథాన్ను దృష్టిలో పెట్టుకొని నగరంలో రన్ జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు.
ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్ రన్ నెక్లెస్ రోడ్డులో ప్రారంభమై ఖైరతాబాద్ ఫ్లైఓవర్, రాజ్భవన్ రోడ్డు, సీఎం క్యాంపు కార్యాలయం, పంజాగుట్ట ఫ్లైఓవర్, ఎన్టీఆర్ భవన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, పెద్దమ్మ తల్లి దేవాలయం, నీరూస్ జంక్షన్, మాదాపూర్, సైబర్ టవర్స్ మీదుగా ఐకియా అండర్ పాస్, బయో డైవర్సిటీ జంక్షన్, సీపీ కార్యాలయం, గచ్చిబౌలి ఫ్లైఓవర్ మీదుగా ఇందిరానగర్, ఐఐఐటీ జంక్షన్, విప్రో సర్కిల్, క్యూ సిటీ నుండి హెచ్సీయూ గేట్ నెంబర్ 2 మీదుగా గచ్చిబౌలి స్టేడియంకు చేరుకుంటుంది. అదే విధంగా 10 కే రన్ హైటెక్స్ ప్రధాన ద్వారం వద్ద ప్రారంభమై శిల్పారామం, సైబర్ టవర్స్ మీదుగా మైండ్స్పేస్ అండర్ పాస్, బయోడైవర్సిటీ జంక్షన్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, ఇందిరానగర్, ఐఐఐటీ జంక్షన్ మీదుగా గచ్చిబౌలి స్టేడియం వరకు సాగుతుంది.
జూబ్లీహిల్స్ నుండి కొత్తగూడ, కొండాపూర్ రూట్లో వెళ్లే వాహనదారులు జూబ్లీహిల్స్ నీరూస్ జంక్షన్ మీదుగా మాదాపూర్ 100 ఫీట్ రోడ్డు, సైబర్ టవర్స్ వద్ద నుండి కొత్తగూడ వద్దకు చేరుకోవచ్చు.
జూబ్లీహిల్స్ నుండి మైండ్స్పేస్, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి ఓఆర్ఆర్..ఈ రహదారిలో వెళ్లే వారు జూబ్లీహిల్స్ నుండి మాదాపూర్ 100 ఫీట్ రోడ్డు, ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ ఆర్ఓబీ వద్ద యూటర్న్ తీసుకొని సైబర్ టవర్స్ ఫ్లైఓవర్ మీదుగా మైండ్స్పేస్కు చేరుకోవచ్చు.