byసూర్య | Sat, Aug 24, 2019, 06:16 PM
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు పథకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు ప్రశంసిస్తుంటే.. అవినీతి జరిగిందంటూ స్థానిక భాజపా నేతలు విమర్శించడం సరికాదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. భాజపా మాదిరిగా తెరాస ప్రభుత్వానివి మిస్డ్ కాల్ సభ్యత్వాలు కావని ఎద్దేవా చేశారు. శనివారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. ఇప్పటికైనా భాజపా నేతలు తమపై విమర్శలు మాని కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును భాజపా నేతలు కావాలనే విమర్శిస్తున్నారని ఆరోపించారు. పనిచేసే అధికారులపై ఇష్టానుసారం విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. విద్యుత్ రంగంలో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతుంటే అవగాహనా లోపంతో కుంభకోణాలు జరిగాయంటూ పదేపదే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. భాజపా పాలిత రాష్ట్రాల పనితీరును ఎప్పుడైనా పరిశీలించారా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని నీతి ఆయోగ్ సైతం సిఫారసు చేసిందని మంత్రి గుర్తుచేశారు.