byసూర్య | Thu, Aug 22, 2019, 08:19 PM
తెలంగాణలో మెదక్ రాజకీయం చాలా భిన్నం. పొలిటికల్ లెజెండ్స్ ఖిల్లా మెదక్ జిల్లా. ఇలాంటి రాజకీయ ఉద్దండులపై గురిపెట్టింది భారతీయ జనతా పార్టీ. మెదక్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి సునీతా లక్ష్మ రెడ్డి బీజేపీలో చేరేందుకు దాదాపుగా సిద్ధమై, చివరి నిమిషంలో మనసు మార్చుకుని టీఆర్ఎస్లో చేరారు. ఆమె చేరిక కోసం బీజేపీ రాష్ట్ర నాయకత్వం అన్ని విధాలా కృషి చేసినప్పటికీ, ఫలితం సాధించలేకపోయారు. దీంతో మరో సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నర్సింహపై కాషాయ అధిష్టానం దృష్టి పెట్టిందని మెదక్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినికి బీజేపీ నాయకులతో, సత్సంబంధాలున్నాయి. మొన్న శాసనసభ ఎన్నికల సమయంలో, భర్తను కాదని బీజేపీలో జాయినై షాక్ ఇచ్చారు పద్మిని. ఒకవైపు తాను కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉంటే, మరోవైపు భార్య బీజేపీలో చేరడంతో దామోదర రాజ నర్సింహ కంగుతున్నారు. ఎలాగోలా భార్యను ఒప్పించి రాత్రికి రాత్రి తిరిగి భార్యకు కాంగ్రెస్ కండువా కప్పారు. అంతటితో కుటుంబంలో రాజకీయ సంక్షోభం ముగిసినట్టయ్యింది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత, దామోదర రాజనర్సింహ, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మొన్నటికి మొన్న మున్సిపల్ ఎన్నికలపై సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి కాంగ్రెస్ సమావేశానికి సైతం దామోదర దూరంగా ఉన్నారు. దామోదర్ రాజనర్సింహ భార్య పద్మిని సైతం ఇటీవలే బీజేపీ నేత రాం మాధవ్ను సైతం కలిసారట. అప్పటి నుంచి దామోదర బీజేపీలోకి వెళ్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటిని దామోదర ఖండించకపోవడంతో, కమలం గూటికి అన్న ప్రచారానికి మరింత బలం చేకూరుతోంది. ఇటీవలే బీజేపీ అధిష్టానం చేపట్టిన ఆపరేషన్ తెలంగాణలో భాగంగా, దామోదరను సైతం బీజేపీ ముఖ్య నేతలు కలిసారట. రాజనర్సింహ సైతం తనకు సమయం కావాలని అడిగారట. అంతా అనుకున్నట్లు జరిగితే దామోదర బీజేపీ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోందట.