byసూర్య | Wed, Aug 21, 2019, 05:32 PM
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని సింగాయిపల్లి, నేంటూరు, కోమటిబండ తదితర ప్రాంతాల్లో చేపట్టిన అటవీ పునరుద్ధరణ పనుల ను ఈరోజు జిల్లాల కలెక్టర్లకు స్వయంగా చూపించారు సిఎం కెసిఆర్. పల్లెలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళ లాడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సిఎం కెసిఆర్ తెలిపారు. దీనికి అనుగుణంగా 60 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని, అవినీతికి ఆస్కారం లేని, రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేని, పారదర్శకమైన రెవెన్యూ చట్టానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తున్నదని కెసిఆర్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అటవీ భూముల్లో అడవుల పునురుద్ధరణకు ప్రణాళిక రూపొందించి కార్యాచరణ ప్రారంభించాలన్నారు. సామాజిక అడవుల పెంపకం, ఆవాస ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గించడానికి ఉపయోగపడితే అడవుల పెంపకం మొత్తం వాతావరణంలోనే మార్పు వస్తుందని, వర్షాలు బాగా కురవడానికి జీవ వైవిధ్యానికి దోహద పడుతుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని అటవీ భూములు చెట్లులేని ఎడారుల్లా మారిన దుస్థితి ఉండేదన్నారు. అటవీ భూముల్లో అడవిని పునరుద్ధరించాలనే లక్ష్యంతో సమగ్ర ప్రణాళిక రుపొందించి అమలు చేశామన్నారు. మూడేళ్ల క్రితం ప్రారంభమైన పునరుద్ధరణ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని, ఈ ప్రాంతమంతా పచ్చని చెట్లతో కళకళలాడుతున్నాయిని వెల్లడించారు. వర్షపాతం కూడా పెరిగిందని, 27 రకాల పండ్ల మొక్కలను కూడా ఈ అడవుల్లో పెంచడం వల్ల ఇవి మంకీ ఫుడ్ కోర్టులాగా తయారవుతాయన్నారు. గజ్వేల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేపట్టిన పునరుద్ధరణ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు కెసిఆర్ సూచించారు.