byసూర్య | Tue, Aug 20, 2019, 09:16 AM
హైదరాబాద్: కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనలో కలెక్టర్లను పాత్రధారులను చేయడంకోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నేడు ప్రగతిభవన్లో కలెక్టర్ల సమావేశం నిర్వహిస్తున్నారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లతో పాటు మంత్రులు, సీఎస్, సంబంధిత శాఖల కార్యదర్శులు పాల్గొంటారు. నయాపైసా లంచం ఇవ్వకుండా ప్రజలకు సత్వరం సేవలు అందేలా నూతన రెవెన్యూ చట్టం రూపొందాలన్న దృఢ నిశ్చయంతో ఉన్న సీఎం కేసీఆర్.. ఈ సమావేశంలో కలెక్టర్లందరి నుంచి అభిప్రాయాలు తీసుకుంటారు. వాటిని క్రోడీకరించి నూతన చట్టంలో పొందుపరిచే అవకాశం ఉంటుంది. కొత్తగా అమల్లోకి వచ్చిన పంచాయతీరాజ్, పురపాలక చట్టాల అమలు విషయంలో కూడా అభిప్రాయాలను ఈ సమావేశంలో తీసుకోనున్నారు. పట్టణాలు, గ్రామాల అభివృద్ధికి నిర్దేశించిన 60 రోజుల ప్రణాళికపైనా సమావేశంలో చర్చిస్తారు. కొత్త చట్టం రూపకల్పనతోపాటు, అమలులోకి వచ్చిన చట్టాల అమలు, 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ అమలుపై జిల్లా కలెక్టర్లకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశనం చేయనున్నారు.