byసూర్య | Mon, Aug 19, 2019, 11:03 PM
ఇటీవల తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఓటమి పాలయ్యారు. నిజామాబాద్ నుంచి లోక్సభ బరిలోకి దిగిన ఆమె పరాజయం పాలయ్యారు. అయితే తాజాగా కవిత ఓటమికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు సినీ నటుడు, బీజేపీ నేత బాబుమోహన్. లోక్ సభ ఎన్నికల్లో కవిత ఓడిపోవడం వెనుక తన పాత్ర ఉందంటూ బాబు మోమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో బీజేపీ రోజురోజుకూ బలపడుతోందన్నారు బాబు మోహన్. బీజేపీ సభ్యత్వ నమోదుకు భారీ స్పందన వస్తోందన్నారు. సభ్యత్వ నమోదుపై బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా సంతృప్తిని వ్యక్తం చేశారన్నారు. రానున్న రోజుల్లో బీజేపీలోకి భారీ ఎత్తున చేరికలు ఉండబోతున్నాయని తెలిపారు. పరిపాలించడం చేతకాకే... బీజేపీపై టీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని ఆయన ఆరోపించారు. క్షేత్ర స్థాయిలో బీజేపీ ఎంత బలంగా ఉందో కొంత కాలం ఆగితే టీఆర్ఎస్ కు అర్థమవుతుందని చెప్పారు. కూల్చడం తప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరేమీ తెలియదని విమర్శలు గుప్పించారు బాబు మోహన్.