byసూర్య | Mon, Aug 19, 2019, 06:26 PM
కృష్ణా పరివాహకంలో వరద క్రమంగా తగ్గుతోంది. ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణా నదిలోని ప్రాజెక్టుల్లోకి వరద క్రమంగా నెమ్మదించింది. దీంతో అధికారులు నాగార్జునసాగర్ ప్రాజెక్టులోని మొత్తం 12 గేట్లనూ మూసివేశారు. ప్రస్తుతం 14 గేట్ల ద్వారా 2.16 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తు్న్నారు. జలాశయంలోకి 4.60 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. 2.55 లక్షల క్యూసెక్కుల ఔట్ఫ్లో ఉంది. సాగర్ పూర్తిస్థాయి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 303.94 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 586.70 అడుగులుగా ఉంది.
మరోవైపు శ్రీశైలం జలాశయంలోకి క్రమంగా వరద తగ్గుముఖం పట్టడంలో ఐదు గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం 3.87 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వస్తుండగా 2.47 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 883 అడుగులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 205 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 30,459 క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 42 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2,400 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2,026 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ ద్వారా 34 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
పులిచింతల జలాశయంలోనూ వరద ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం జలాశయంలో ఇన్ఫ్లో 2.99 లక్షల క్యూసెక్కులు కాగా ఔట్ఫ్లో 2.09 లక్షల క్యూసెక్కులుగా ఉంది. పులిచింతల పూర్తి్స్థాయి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 36.66 టీఎంసీలుగా ఉంది. జలాశయం ప్రస్తుతం నీటిమట్టం 168.56 అడుగులుగా ఉంది.