byసూర్య | Mon, Jun 24, 2019, 12:45 PM
రాజన్న సిరిసిల్ల జిల్లాలో TRS పార్టీ కార్యాలయానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతు..తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కావాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. సాగు, తాగు నీటి కష్టాలు తీర్చే సీఎం కేసీఆర్ ఫోటోను తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ ఇంటిలోను పెట్టుకుని పూజించే రోజు వస్తుందని అన్నారు. సీఎం కేసీఆర్ వంటి సమర్థవంతమైన నాయకుడు ఉన్నంత కాలం, టీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకు శ్రీరామ రక్ష అని కేటీఆర్ పేర్కొన్నారు. గోదావరి, కృష్టా నీరు తెలంగాణకు రావాలంటే కేసీఆర్ నాయకత్వంతోనే సాధ్యమన్నారు.
తెలంగాణలోని అన్ని జిల్లాల్లోను టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను నిర్మిస్తోంది.ఈ క్రమంలో సిరిసిల్ల జిల్లాలో నిర్మిస్తున్న పార్టీ కార్యాలయం దసరా పండుగ నాటికీ పూర్తికానుందని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నందుకు ప్రజలు ప్రతీ ఎన్నికల్లోను టీఆర్ఎస్ కు ఓట్లు వేసి గెలిపిస్తున్నారన్నారు. కేసీఆర్ వంటి కార్యదక్షత గల నేత వల్లనే రాష్ట్రం అభివృద్దిలో దూసుకుపోతుందన్నారు.
అటు పరిపాలను, ఇటు అభివృద్ధిని అద్భుతంగా కొనసాగిస్తున్న కేసీఆర్ పాలనకు ప్రజలు అర్థం చేసుకుంటున్నారనీ..ప్రభుత్వం చేపడుతున్న సంక్షే పథకాలతో ప్రజలు ఆనందం వ్యక్తంచేస్తున్నారని తెలిపారు. మిషన్ భగీరథతో ఇంటింటికి తాగునీరు అందిస్తు తెలంగాణ ఆడబిడ్డల నీటి కష్టాలను తీరుస్తున్నామన్నారు.
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య కార్యకర్తలు వారధిగా పనిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. జూన్ 27న పార్టీ సభ్యత్వ కార్యక్రమం ప్రారంభమవుతుందని..మొదటి సభ్యత్వాన్ని సీఎం కేసీఆర్ తీసుకుంటారని తెలిపారు.సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తయిన తరువాత కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాలుంటాయనీ తెలిపారు. పార్టీని మరింత పటిష్టంచేసేందుకు ప్రతీ కార్యకర్తా పట్టుదలతో కృషి చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.