byసూర్య | Mon, Jun 24, 2019, 11:50 AM
లోకకల్యాణార్థం రాజన్న ఆలయంలో రేపు వరుణయాగ కార్యక్రమాన్ని అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో అర్చకులు ఘనంగా నిర్వహిస్తారని ఆలయ ఈవో దూస రాజేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం అర్చకులు వరుణయాగానికి అంకురార్పణ చేస్తారని , ఉదయం 6 గంటలకు స్వామివారి కల్యాణమండపంలో పుణ్యాహవాచనంతో యాగం ప్రారంభమైతుందని పేర్కొన్నారు. స్వామివారికి మహన్యాసపూర్వకంతో సంతతధారాభిషేకం ప్రారంభమవుతుందని వారు తెలిపారు. అన్ని ఏర్పాట్లూ చేస్తున్నామని , ఈ వరుణయాగంలో భాగంగా ఆలయ ధర్మగుండంపై నవగ్రహపూజ, వాస్తుపూజ, క్షేత్రపాలకపూజ, రుష్యశృంగ స్థాపన, శతానువాద పారాయణాలు, విరాటపర్వ పారాయణాలు, అగ్నిస్థాపన, రుష్యశృంగహవనం, కారీవేష్టి మొదలగు కార్యక్రమాలు ఉంటాయని స్థానాచార్యులు వెల్లడించారు. ఇందుకుగాను ఉదయం భక్తులు స్వామివారి గర్భగుడిలో నిర్వహించుకునే ఆర్జితసేవలు ఉండవని ఈవో స్పష్టంచేశారు.