byసూర్య | Fri, Jun 21, 2019, 03:35 PM
సిద్దిపేట: సీఎం కేసీఆర్ పట్టుదల వల్లే ప్రాజెక్టులు పూర్తవుతున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ వేడుకల్లో హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం కావటం సంతోషంగా ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క భారీ ప్రాజెక్టు కూడా నిర్మించుకోలేకపోయామన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టుల పేర్లు సైతం మర్చిపోయామన్నారు. రానున్న రోజుల్లో రెండు పంటలకు నీటిని చూస్తామన్నారు. సీఎం కేసీఆర్ శ్రమతో మూడేళ్లలోనే ప్రాజెక్టు పూర్తయ్యిందన్నారు. 70 ఏళ్లలో ఎన్నో పార్టీలు పాలించినా ప్రాజెక్టులు కట్టలేదన్నారు. ప్రాజెక్టు కోసం ఇంజినీర్లు, అధికారులు, కార్మికులు ఎంతో కష్టపడ్డారని కొనియాడారు. ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కాళేశ్వరం పనుల్లో తన వంతు సహాయం చేసినందుకు సంతోషంగా ఉందని హరీశ్ రావు పేర్కొన్నారు.