byసూర్య | Thu, Jun 20, 2019, 06:30 PM
తెలుగు రాష్ట్రాల్లో వివిధ పార్టీలకు చెందిన నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇతర పార్టీలకు చెందిన చాలా మంది నేతలు తమ పార్టీ నేతలతో టచ్లో ఉన్నారని, వారి పేర్లు బయటపెట్టబోమని అన్నారు. బీజేపీ నాయకత్వం, నరేంద్రమోదీ పాలన పట్ల నమ్మకం ఉండబట్టే అనేకమంది బీజేపీ వైపు చూస్తున్నారని ఆయన అన్నారు.
భారతీయ జనతాపార్టీని బలోపేతం చేయడానికి ఇతర పార్టీల నాయకులను కూడా పార్టీలోకి ఆహ్వానిస్తామని గతంలో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా జీవీఎల్ గుర్తు చేశారు. ఇది తాము వేసిన ఆకర్షణ కాదని, నరేంద్రమోదీకి ప్రజల్లో ఉన్న ఆదరణ కారణంగా పలు పార్టీలకు చెందిన నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని ఆయన అన్నారు. బీజేపీ క్రమేణ బలపడుతుందన్నదానికి ఇదొక నిర్శనమని జీవీఎల్ వ్యాఖ్యానించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నాయకులు బీజేపీ వైపు ఆకర్షితులై పార్టీలో చేరాలని ఆలోచిస్తున్నారన్నమాట వాస్తవమని ఆయన స్పష్టం చేశారు.