byసూర్య | Thu, Jun 20, 2019, 11:16 AM
హైదరాబాద్ పాతబస్తీలో అర్ధరాత్రి హై డ్రామా చోటు చేసుకుంది... జుమ్మెరాత్ బజార్లో రాత్రి సమయంలో స్వాతంత్ర్య సమరయోధురాలు, రాణి అవంతి బాయ్ లోథ్ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు ఓ వర్గం ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విగ్రహ ప్రతిష్టాపనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకు దిగారు స్థానిక యువకులు. ఆందోళనకారులకు మద్దతుగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘటనా స్థలానికి చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అనుమతి లేకుండా విగ్రహాన్ని పెట్టడం కుదరదంటూ పోలీసులు అడ్డునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొందరు ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లురువ్వారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురితో పాటు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తలకు గాయాలయ్యాయి. వీరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.