byసూర్య | Wed, Jun 19, 2019, 05:04 PM
ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డిపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని భాజపాకు చెందిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. మోదీ, కిషన్రెడ్డిలకు కేసీఆర్ భేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దిల్లీలో సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాద మూలాలను అంతం చేస్తామని మాత్రమే కిషన్రెడ్డి అన్నారన్నారు. రాష్ట్రంలో జరిగిన ఘటనలు స్థానికుల సహకారం లేకుండా జరిగాయా? అని ప్రశ్నించారు. దేశ ప్రధానిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడాన్ని ప్రజలు హర్షించరన్నారు.
రైతుల ఆత్మహత్యలు చూశాం కానీ.. విద్యార్థుల ఆత్మహత్యలు కేవలం తెలంగాణలోనే చూస్తున్నామని సంజయ్ దుయ్యబట్టారు. విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించని సీఎంగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని చెప్పారు. దిల్లీకి వచ్చి పొర్లు దండాలు పెట్టడం.. హైదరాబాద్లో కేంద్రం మెడలు వంచుతామంటూ ప్రగల్భాలు పలకడం కేసీఆర్కే చెల్లిందని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్రం రాష్ట్రానికి నిధులు ఇవ్వలేదని కేసీఆర్కి ఇప్పుడే గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. త్వరలోనే రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధుల లెక్కలన్నీ బయటపెడతామని చెప్పారు.