byసూర్య | Tue, Jun 18, 2019, 01:01 AM
గోదావరిలో నీటి లభ్యత పుష్కలంగా ఉంటుంది. ఆ నీటిని సాధ్యమైనంత వరకు వినియోగించుకోవాలన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష. అందులోంచి ఆవిర్భవించినవే కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులు. ప్రస్తుతం ఉన్న ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు మరింత ఎక్కువ ఆయకట్టును సాగులోకి తేవడమే వీటి లక్ష్యం.
గతంలో దుమ్ముగూడెం రాజీవ్సాగర్, రుద్రంకోట ఇందిరాసాగర్ పేర్లు తో . 5 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంగా ప్రాజక్టు నిర్మించాలని నిర్ణయించారు. రూ.5,500 కోట్ల వ్యయం అంచనా తో ఈ ప్రాజెక్టు ఆరంభానికి ముందే అంతర జిల్లాల సాగునీటి వివాదాలకు తెరలేపింది. దీంతో నాటి ప్రభుత్వం ఆకృతిలో మార్పులు చేసి పనులు ఆరంభించింది. అయితే రాష్ట్ర విభజన, తెరాస అధికారంలోకి రావటంతో అంతర జిల్లాల సాగునీటి వివాదాలకు ఆస్కారం లేకుండా.. అదనంగా మరో 2 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేలా అదే స్థానంలో సీతారామకు రూపకల్పన చేసింది. ఇప్పుడిప్పుడే కాలువల తవ్వకం ఆనకట్ట వద్దకు చేరుకుంటోంది. కాగా తొలి దశలో కనీసం మూడు విద్యుత్తు మోటార్లతో అయినా పని చేయించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. మొదటి పంప్ హౌస్ను జూన్, జులై వరకల్లా, రెండో పంప్ హౌస్ను ఆగస్టు, సెప్టెంబర్ వరకల్లా, మూడో పంప్ హౌస్ను అక్టోబరు, నవంబరు వరకల్లా సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
లక్ష్యం మేరకు పనుల పూర్తికి హైదరాబాద్లోని సీఎం కార్యాలయ అధికారులు పర్యవేక్షణ చేపట్టారు. ఆ కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ తరచూ జిల్లాకు వచ్చి పనుల పురోగతిని స్వయంగా పరిశీలిస్తున్నారు. పనులు ఇటీవల వేగం పుంజుకున్నా ప్రభుత్వం ఆశించిన స్థాయిలో జరగడం లేదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి చూస్తే వచ్చే ఆగస్టు నాటికి తొలి దశ లక్ష్యం నెరవేరుతుందా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. కొందరు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, కొరవడుతున్న పర్యవేక్షణే దీనికి కారణంగా కనిపిస్తోంది. మరోవైపు కాళేశ్వరం పూర్తయ్యేందుకు చూపిన శ్రద్ధ సీతారామపై కేంద్రీకరించక పోవటం వల్లే ఈ ప్రాజక్టు పనులలో మితిమీరిన జాప్యం జరుగుతోందని, లక్ష్యం సాధించడం సంగతి ఆ సీతారాముడే చూసుకుంటాడన్న వ్యంగ్యభాషణలు వినిపిస్తున్నాయి.