byసూర్య | Thu, Mar 21, 2019, 05:30 PM
తెలంగాణలోని అన్ని లోక్ సభ స్థానాలను గెలుచుకోవాలని టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఇక తెలంగాణలో కోలుకుని తమ సత్తా చాటాలని భావిస్తున్న కాంగ్రెస్ సైతం... సీనియర్లందరినీ బరిలోకి దింపి లోక్ సభ ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నా... ఆ పార్టీ అసలు టార్గెట్ మాత్రం ఐదు స్థానాలే అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ ఐదు స్థానాలను గెలుచుకోవడంపైనే హస్తం పెద్దలు ఫోకస్ చేశారని సమాచారం.
తెలంగాణలోని నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, చేవేళ్ల, మల్కాజ్ గిరి స్థానాలను కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోందని తెలుస్తోంది. ఈ ఐదు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా ఇంకా బలంగానే ఉందనే అంచనాకు వచ్చిన కాంగ్రెస్ పెద్దలు... ఇక్కడ పోటీలో బలమైన అభ్యర్థులను నిలపాలని నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలోనే మల్కాజ్ గిరి నుంచి రేవంత్ రెడ్డి, నల్లగొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, చేవేళ్ల నుంచి విశ్వేశ్వర్ రెడ్డిలను పోటీలో నిలిపినట్టు తెలుస్తోంది. ఇక ఖమ్మం నుంచి మరోసారి రేణుకా చౌదరి పోటీలో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ...టీఆర్ఎస్, బీజేపీలను తట్టుకుని అనుకున్న లక్ష్యాలను సాధిస్తుందా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.