byసూర్య | Wed, Mar 20, 2019, 08:54 PM
ఇప్పటికే గద్వాల మాజీ ఎమ్మెల్యే డి.కె.అరుణ కమలం పార్టీ చెంతకు చేరేందుకు ఏర్పాటు చేసుకున్న తరుణంలో మాజీ మంత్రి ఎం. ముఖేష్ గౌడ్, ఆయన కుమారుడు విక్రమ్ గౌడ్ లకు బీజేపీ నుండి పిలుపు వచ్చినట్టు సమాచారం . ఈ మేరకు ముఖేష్ తనయుడు విక్రమ్ గౌడ్ తో బీజేపీ నేతల చర్చలు జరుపుతున్నారని పార్టీలో ఇద్దరికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇటీవలి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా ముఖేష్ గౌడ్ పోటీ చేసి బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ చేతిలోల ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందునుంచే తన ఓటమికి పనిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్ పెద్దలు ఇష్టానుసారం వ్యవహరించారని అసహనంతో ఉన్న ఆయన పార్టీ వీడుతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మధ్యవర్తిత్వంలో టీఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నారంటూ సమాచారం అందిన కాంగ్రెస్ పెద్దలు అప్రమత్తమై, పార్టీ అండదండలు ఎప్పుడూ ఉంటాయని భరోసా ఇచ్చారు. కాని,మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ముఖేష్ గౌడ్ కూడా పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం.