byసూర్య | Tue, Mar 19, 2019, 08:39 PM
కాంగ్రెస్ నాయకుడు పి.కార్తీక్ రెడ్డి టీఆర్ఎస్ చేరిక సందర్భంగా శంషాబాద్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు. ఒక లక్ష ఎకరాలకు తగ్గకుండా వచ్చే రెండేళ్లలో కృష్ణా జలాలు ఇచ్చి రంగారెడ్డి జిల్లా ప్రజల కాళ్లు కడుగుతామన్నారు. కృష్ణా జలాల కోసం కోసం మా రంగారెడ్డి ప్రజలు ఎదురు చూస్తున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అడిగారన్నారు. ఉస్మాన్ సాగర్ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తామన్నారు. అలాగే చేవెళ్ల నియోజకవర్గంలో పారిశ్రామిక వాడలు వస్తున్నాయన్నారు. రంగారెడ్డి జిల్లా ప్రజా ప్రతినిధుల కోరిక మేరకు జోగులాంబ జోన్ లో ఉన్న జిల్లాను ఛార్మినార్ జోన్ లోకి మారుస్తామన్నారు. చేవేళ్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ గెలవాలన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత రంగారెడ్డి జిల్లా అభివృద్ధి చెందదని తెలంగాణ ఉద్యమ సమయంలో లేనిపోని ప్రచారం చేశారు. నాలుగున్నర ఏళ్లలో రంగారెడ్డి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. కేసీఆర్ నాయకత్వం మరింతగా బలపడాలంటే నాయకులు ఇచ్చిపుచ్చుకునే దోరణితో వ్యవహరించాలన్నారు. చేవెళ్ల టీఆర్ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎఐసీసీ అధ్యక్షులు రాహుల్ సమక్షంలో చేరారు. అయినా మేము విమర్శించలేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరితే నోటికొచ్చినట్లు విమర్శించడం ఎంత వరకు సబబు అన్నారు. చేరికలు సహజమని, అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు. 16 మంది పార్లమెంటు సభ్యులు ఢిల్లీలో ఉంటే పాలమూరు రంగారెడ్డి పథకానికి నిధులు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా పరుగెత్తుకుంటూ వస్తుందన్నారు. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు మెట్రో రైలు నిర్మిస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సందర్భంగా ప్రకటించారు.