byసూర్య | Tue, Jan 22, 2019, 11:04 AM
బలూచిస్థాన్ : రోడ్డు ప్రమాదంలో 26మంది సజీవ దహనమైన ఘటన పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రాంతంలో జరిగింది. ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో 26 మంది సజీవదహనమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..లస్బెలా జిల్లాలో ఈ ఘటన జరిగింది. 40 మంది ప్రయాణికులతో కరాచీ నుంచి పంజ్గుర్ వెళ్తున్న ఓ బస్సును ఎదురుగా వస్తున్న డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకునేందుకు బస్సు కిటికీల నుంచి దూకేందుకు యత్నించారు. అయితే అప్పటికే రెండు వాహనాలకు మంటలు వ్యాపించాయి. దీంతో వారంతా మంటల్లో చిక్కుకుపోయారు. ప్రమాదంలో 26 మంది సజీవదహనమైనట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో గుర్తుపట్టని రీతిలో వారి శరీరాలు కాలిపోయాయని తెలిపారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించారు.