byసూర్య | Tue, Jan 22, 2019, 10:52 AM
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం నుంచి ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మంగళవారం ఉదయం నుంచి ఢిల్లీ, గురుగ్రామ్ ప్రాంతాల్లో వడగండ్ల వాన కురుస్తోంది. భారీ వర్షం కారణంగా హస్తిన వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నల్లటి మేఘాలు కమ్ముకోవడంతో నగరమంతా చీకటిమయమైంది. ఉదయం 9 గంటల సమయంలోనూ అర్ధరాత్రిని తలపించింది. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా కన్పించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షం కారణంగా రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. ఢిల్లీకి వెళ్లే దాదాపు 15 రైళ్లు ఆలస్యమైనట్లు అధికారులు వెల్లడించారు. పంజాబ్, చండీగఢ్, ఉత్తరాఖండ్లోనూ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అటు హిమాచల్ ప్రదేశ్లో సిమ్లా సహా కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన మంచు కురుస్తోంది. వాహనాలు, రోడ్లపై మంచు దట్టంగా పరుచుకుంది.